ఆ 'దమ్ బిర్యానీ' రుచే వేరు... బెంగళూరులో కిలోమీటరు పొడువునా బారులు తీరిన జనం!

  • ఇటీవలే తెరుచుకున్న హోటళ్లు
  • బెంగళూరు ఆనంద్ హోటల్ కు కస్టమర్ల తాకిడి
  • అందరికీ బిర్యానీ అందించలేమన్న హోటల్ యజమాని
భారత్ లో దమ్ బిర్యానీకి ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు. దమ్ బిర్యానీకి హైదరాబాద్ ఎంతో ఫేమస్ అయినా, ఇతర నగరాల్లోనూ రుచికరమైన దమ్ బిర్యానీ దొరుకుతుంది. బెంగళూరులోని ఆనంద్ దమ్ బిర్యానీ హోటల్ కూడా అలాంటిదే.

కరోనా ప్రభావంతో ఇటీవల కొన్నిరోజుల వరకు ఈ హోటల్ మూతపడింది. ప్రస్తుతం పాక్షికంగా తెరుచుకుంది. కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతించారు. అయితే, హోటల్ తెరిచారో లేదో, రుచికి బాగా అలవాటుపడిన కస్టమర్లు ఆగలేకపోయారు. పార్శిళ్ల కోసం ఏకంగా కిలోమీటరు పొడువున హోటల్ ముందు బారులు తీరారు.

ఈ క్యూలైన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని హోస్కోటిలో ఉన్న ఈ ఆనంద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ కస్టమర్ల తాకిడితో తడిసి ముద్దవుతోంది. గతంతో పోల్చితే విక్రయాల్లో 20 శాతం పెరుగుదల కనిపిస్తోందని రెస్టారెంట్ యజమాని సంతోషంగా చెప్పారు. అయితే, క్యూ చూస్తే కిలోమీటరు పొడువు ఉందని, కానీ తాము అందరికీ బిర్యానీ అందించలేకపోవచ్చని విచారం వ్యక్తం చేశారు.

కాగా ఈ వీడియోపై కావేరి అనే నెటిజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇదేం బిర్యానీయో నాక్కూడా చెప్పండి, లేకపోతే ఈ బిర్యానీ ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా?' అంటూ క్యూ లైన్ ను చూసి విస్మయానికి గురయ్యారు.


Dum Biryani
Anand Bhavan
Bengaluru
Que Line
Corona Virus
Lockdown

More Telugu News